న్యాయం చేస్తానన్న పవన్.. ఆధారాలే లేవంటున్నాడు: సుగాలి పార్వతి | Sugali Parvati Serious Comments On pawan Kalyan | Sakshi
Sakshi News home page

న్యాయం చేస్తానన్న పవన్.. ఆధారాలే లేవంటున్నాడు: సుగాలి పార్వతి

Jun 21 2026 1:09 PM | Updated on Jun 21 2026 3:02 PM

Sugali Parvati Serious Comments On pawan Kalyan

సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రంగా ఖండించారు. ఈ కేసును నీరుగార్చేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందిన పవన్.. ఇప్పుడు అదే కేసుపై భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసులోని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం తమకు కలుగుతోందని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై తాజాగా సుగాలి పార్వతి స్పందించారు. ఈ సందర్బంగా పార్వతి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసే తన మొదటి ప్రాధాన్యమని చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఈ కేసులో పవన్‌ ఒక్క ఆదేశాలు జారీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో అఘాయిత్యం జరిగింది. ఈ అన్యాయంపై పవన్‌కు పూర్తిగా వివరించాను, ఆధారాలు కూడా ఇచ్చాను. అయినప్పటికీ  ఇప్పటికీ న్యాయం చేయలేదు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఏమయ్యారు?. నిందితులకు అమ్ముడుపోయే విధంగా పవన్‌ వ్యహరిస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ఈ కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం దారుణం.

సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు. దీనిపై వక్రీకరించి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలోనే కేసులో ఆధారాలను తారుమారు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నా.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ తన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని వాపోయారు. కానీ, సుగాలీ ప్రీతి కేసును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసి అధికారంలోకి వ‍చ్చాక పవన్ కళ్యాణ్ మాట మారుస్తున్నారు. సుగాలీ ప్రీతి కేసును పవనే నీరుగారుస్తున్నారు.

ఈ కేసులో నిందితులను వీదేశాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు.‌ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేశారు. సుగాలీ ప్రీతి ఆత్మకు శాంతి కలిగించే విధంగా నేను పోరాటం చేస్తాను. మా కుమార్తె కోసం వీల్ చైర్ యాత్రను ప్రారంభిస్తాను. తప్పకుండా న్యాయం కోసం పోరాటం చేస్తాం’ అని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement