
సాక్షి, టాస్క్ఫోర్స్: తీసుకున్న అప్పును చెల్లించని కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో పాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది.
వివరాల ప్రకారం.. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్కు చెందిన పృధ్వీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్ 670/ ఏ1సీ1, 2 ఎకరాల ఆస్తి (కామిశెట్టి కాలేజీ)ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృధ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 16న ఉదయం 10 గంటలలోపు సదరు ఆస్తిని పృధ్వీ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. రాధా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు బద్వేలి శ్రీనివాసులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మీనా, ఓబుళమ్మ, ఇంద్ర, ఉమాదేవి, హరినాథరెడ్డి, సుదర్శన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శివారెడ్డి, నైనితారెడ్డి, విజయశేఖర్రెడ్డి, రఘునాథరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.