కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో వివాహ విందు
రెండు, మూడు పూటలు మాంసాహారం తినడమే కారణం
కొత్తపేట: వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని సుమారు 50 మంది అస్వస్థతకు గురైన ఘటన కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు రామమోహనరావుపేటలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. గిడ్డి లక్ష్మి–శాంతారావు దంపతుల కుమార్తెకు, పల్లి ఏసుబాబు–అచ్చమ్మ దంపతుల కుమారుడికి గురువారం ఉదయం గ్రామంలో వివాహం జరిగింది. బుధవారం పెళ్లికూతురి ఇంటి వద్ద సుమారు 500 మంది భోజనం చేశారు. అక్కడ మిగిలిన ఆహార పదార్థాలు రాత్రిపూట, ఇంకా మిగిలినవి గురువారం ఉదయం కూడా ఆరగించారు.
దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 50 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కొత్తపేట సీహెచ్సీకి తరలించారు. మాంసాహారం రెండు, మూడు పూటలు తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని డీఎంహెచ్ఓ డాక్టర్ డి.దొర, ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ నిడియా దేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి బాధితులను పరామర్శించారు.


