సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. కమిటీ వారు నిన్న ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామస్థులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే సుమారు 50 మంది గ్రామస్థులను అత్యవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
కాగా జరిగిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు. వంటకు ఉపయోగించిన సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపనున్నారు. ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదానం ఇలా విషాదానికి దారితీసినందుకు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా ఫుడ్ పాయిజన్కు కారణం ఏమిటో త్వరలో వెల్లడించనున్నారు.


