స్టేషనరీ బిల్లులు పెట్టిన వివరాల పట్టిక
40 రోజులకు స్టేషనరీ బిల్లు రూ.30.76 లక్షలు
గతంలో స్టేషనరీ ఖర్చు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు మాత్రమే..
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారంగా సిబ్బంది నియామకం వంటి అవకతవకలకు నెలవుగా మారిన ఏపీ వక్ఫ్బోర్డులో తాజాగా స్టేషనరీ బిల్లుల పేరిట దోపిడీ బాగోతం వెలుగుచూసింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని సమాచారం. వక్ఫ్బోర్డు పరిధిలోని వక్ఫ్ సర్వే కమిషనర్ కార్యాలయంలో సాధారణంగా స్టేషనరీ ఖర్చు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించదు.
ఇటీవల ఆ బిల్లులు రూ.లక్షలు దాటుతుండటంతో సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే స్టేషనరీ ఖర్చు పేరుతో రూ.30,76,558 బిల్లులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతేడాది డిసెంబర్ 11న ఏపీటీఎస్ పేరుతో స్టేషనరీ బిల్లు రూ.3,16,111 పెట్టారు. డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 21 వరకు ఒక్క షణ్ముఖం ఏజెన్సీ పేరుతోనే మొత్తం 14 బిల్లులు పెట్టడం గమనార్హం. ఆ మొత్తం రూ.23,73,247 స్టేషనరీ ఖర్చుగా చూపించారు.
జనవరి 19, 20 తేదీల్లో శ్రీ గాయత్రి ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.3,87,200కు మరో రెండు బిల్లులు పెట్టారు. వక్ఫ్ సర్వే కమిషనర్గా షిరీన్బేగం బదిలీ అయ్యాక, ఆ పోస్టులో ఝాన్సీలక్ష్మి ని ఇన్చార్జిగా నియమించిన తర్వాతే స్టేషనరీ బిల్లుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్టేషనరీ బిల్లుల రూపంలో రూ.లక్షలు దురి్వనియోగం చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.


