
పనులు వేగవంతం చేయండి : హెచ్చెల్సీ ఎస్ఈ
కణేకల్లు: హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఎస్ఈ పురంధరరెడ్డి ఆదేశించారు. యర్రగుంట శివారులోని 137 కిలోమీటర్ వద్ద జరుగుతున్న యూటీ (అండర్ టన్నెల్) పనులతో పాటు బొమ్మనహళ్ మండలంలో 115 నుంచి 130 కిలోమీటర్ మధ్య చేపట్టిన హెచ్చెల్సీ లైనింగ్ పనులను ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దివాకరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ చంద్రశేఖర్, జేఈలు ఓబుళపతి, రమణరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. యూటీ వద్ద వర్షపు నీరు నిలవడంతో వాటిని పూర్తిగా బయటికి పంపింగ్ చేయాలని సూచించారు. మంగళవారం స్లాబ్ వేస్తున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. 115, 117, 155, 169 కిలోమీటర్ వద్ద జరుగుతున్న డీఎల్ఆర్బీ (బ్రిడ్జీ) పనుల్లో నాణ్యత లోపించరాదని ఆదేశించారు. అనంతరం కణేకల్లు చెరువు అవుట్ఫాల్ రెగ్యులేటర్, మోపిడి వద్ద ఎంపీఆర్, పీఏబీఆర్ రెగ్యులేటర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువు లోపు పనులన్నీ పూర్తి కావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నిరుద్యోగులకు
కంప్యూటర్ శిక్షణ
అనంతపురం సెంట్రల్: నిరుద్యోగ యువతీయువకులకు అనంతపురంలోని ఏఏఫ్ ఎకాలజీ సెంటర్లో 60 రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, లైఫ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిషు, కస్టమర్ రిలేషన్ షిప్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, ఇంటర్ ఉత్తీర్ణత, డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ కాలంలో మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. పూర్తి వివరాలకు 73969 50345లో సంప్రదించవచ్చు.
బెంగళూరు–బీదర్ మధ్య రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 29 వరకు శుక్ర, ఆదివారాల్లో (5 సర్వీసులు మాత్రమే) రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. 15న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు ఎక్స్ప్రెస్ రైలు (06539) బయలుదేరి బీదర్ జంక్షన్కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు బీదర్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బెంగళూరుకు మరుసటి తెల్లవారుజూమున 4 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి శని, సొమవారాల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయంరోడ్డు, రాయచూర్, కృష్ణ, యద్గారి, వాడి, షాహబాద్, కలబురిగి, హమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైలు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్బోగీలతోపాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొన్నారు.