
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహమ్మద్ అన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కంబదూరు మండలం డీసీ పల్లిలో సాగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతతో కలసి నదీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలారి రంగయ్యతో కలసి వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అన్ని కులాలతో పాటు స్వచ్ఛంద సంస్థల హక్కులను దోచుకుతినడం పరిపాటిగా మారిందన్నారు. పేదల అభ్యున్నతి కోసం పరితపిస్తున్న ఆర్డీటీ కార్యక్రమాలకు విదేశీ నిధులే ముఖ్యమన్నారు. ఎన్నికల ముందు సీట్ల కోసం, అధికారం చేపట్టిన తర్వాత మంత్రి పదవుల కోసం వారాల తరబడి చర్చలు జరిపిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై పెదవి విప్పకపోవడం దుర్మార్గమన్నారు. ఆర్డీటీ అనేది మతానికి సంబంధించినది కాదని, కేవలం మానవత్వానికి సంబంధినదని గుర్తించాలన్నారు. 55 ఏళ్లుగా తలెత్తని సమస్య కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి ఇంతటి కష్టం రాలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరతో పాటు ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లేకపోతే చరిత్ర హీనులవుతారు
ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం, మాజీ ఎంపీ తలారి రంగయ్య