
నేడు దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం
అనంతపురం అర్బన్: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఉదయం దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 6.30 గంటలకే పరేడ్ మైదానం చేరుకునేలా చూడాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మైదానంలో కనీస సౌకర్యాలు ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, డీఎంహెచ్ఓ ఈబీదేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆర్డీఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఆయుష్ అధికారులు, యోగా గురువులు పాల్గొన్నారు.