అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన సాగిస్తే ప్రజలకు సత్వర సేవలు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం అధికారులకు తెలిసినా మండల స్థాయిలో ఇన్చార్జ్ల పాలనకు తెరదించే దిశగా చర్యలు చేపట్టలేదనే విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వస్తున్నాయి. ఈ నెల 9వ తేదీతో బదిలీల ప్రక్రియ ముగిసినా... దీర్ఘకాలికంగా ఇన్చార్జ్ల పాలన సాగుతున్న కూడేరు, విడపనకలు, వజ్రకరూరు, కణేకల్లు, యల్లనూరు మండలాలకు తహసీల్దార్లను నియమించలేదు. దీంతో ఆయా మండలాల్లో ఇన్చార్జ్ల పాలన తప్పనిసరి అయింది. ఇక అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిపాలనాధికారి పోస్టులోనూ ఎవరినీ నియమించలేదు. దీన్ని బట్టి చూస్తే మండలాల్లో ఇన్చార్జ్ల పాలనకే ఉన్నతాధికారులు మొగ్గు చూపించినట్లుగా స్పష్టమవుతోంది. ఇక బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ... రెండో విడతగా డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టి (9న జారీచేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులతో) అదే రోజు మరోమారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం
కొరవడిన స్పష్టత
జిల్లాలో ఎనిమిది మంది తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్లూరు తహసీల్దారుగా ఉన్న శేషారెడ్డిని కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న యుగేశ్వరిదేవిని డి.హీరేహల్ తహసీల్దారుగా నియమించారు. అక్కడున్న అనిల్కుమార్ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) బెలుగుప్పకు బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే బదిలీలకు సంబంధించి ఈనెల 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత కొరవడింది. కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్గా నియమించిన శేషారెడ్డిని బుక్కరాయసముద్రం మండలం తహసీల్దారుగానూ... అక్కడున్న పుణ్యవతిని పుట్లూరుకు బదిలీ చేశారు. కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ స్థానానికి ఎవరిని నియమించలేదు... అక్కడున్న యుగేశ్వరిదేవి డి.హీరేహాల్ తహసీల్దారుగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయలేదు. ఆమె నియామక ఉత్తర్వులు రద్దు చేస్తే డి.హీరేహాల్ మండలంలో ఇన్చార్జి పాలనలోకి తీసుకురావాలి. రద్దు చేయకపోతే కో–ఆర్డినేషన్ విభాగం బాధ్యతలు మరొకరికి అదనంగా అప్పగించాల్సి ఉంటుంది.
నిబంధన గాలికి
డిప్యూటీ తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో ఒకే స్టేషన్లో ఐదేళ్లు సర్వీసు పూర్తి నిబంధన గాలికొదిలేశారు. కొందరికి ఇక్కడిక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అధికారుల వద్ధ సీసీ (క్యాంపు క్లర్క్)లుగా ఉన్న కొందరి భార్యలు కూడా రెవెన్యూలో విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీల ప్రక్రియలో వీరికి స్థానచలనం కల్పించలేదనే విమర్శలు రెవెన్యూవర్గాల నుంచే వస్తుండడం గమనార్హం,
ప్రజాప్రతినిధుల ‘కనుసన్నల్లో’
తహసీల్దార్ల నియామకాలు పూర్తిగా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేది రెవెన్యూవర్గాల వాదన. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో తహసీల్దారుగా ప్రజాప్రతినిధులు సూచించిన వారినే అధికారులు నియమించాలి. అలాకుండా అధికారులు సొంత నిర్ణయంతో తహసీల్దార్లను నియమిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. అలా నియమితులైన వారు విధుల్లోకి చేరకుండానే వెనుతిరగక తప్పదు.
ఐదు మండలాలకు తహసీల్దార్లను నియమించలేదు
ఆర్డీఓ కార్యాలయ డీఏఓ పోస్టూ ఖాళీ
డీటీల బదిలీల్లో ఐదేళ్ల నిబంధన గాలికి
ప్రక్రియ ముగిశాక కూడా బదిలీలు
ఇన్చార్జ్ల పాలనకే మొగ్గు