
హంద్రీ–నీవా కాలువ గట్టుకు మరమ్మతులు
కూడేరు: మండలంలోని తిమ్మాపురం వద్ద హంద్రీ–నీవా 235.500 కిలోమీటర్ వద్ద కాలువ గట్టుకు ఎర్ర మట్టిని తోలి మరమ్మతులు చేశారు. ఈ గట్టు మట్టిని కాలువ లైనింగ్ పనుల కోసమని కాంట్రాక్టర్ జేసీబీతో తవ్వి తరలించడం గట్టు మొత్తం గుంతలమయమైంది. దీంతో కాలువ ఎగున ఉన్న ఓబిరెడ్డి కుంటలోకి వర్షం చేరుకుంటే కోతకు గురయ్యే ప్రమాదం ఉండేది. అలాగే దిగువన కాలువకు మట్టి తీయడంతో దెబ్బతిని తిమ్మాపురం గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఈ అంశాలపై ‘హవ్వా..ఇదేం లైనింగ్’ శీర్షికతో ఈ నెల 9న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు.. ప్రమాదకరంగా మారిన కాలువ గట్టుకు రాళ్ల చట్టం ఏర్పాటు చేసి ఎర్రమట్టితో చదును చేయించారు.
రైల్వేస్టేషన్లో
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ 6వ ఫ్లాట్ఫాంలోని వెయిటింగ్ హాల్ వద్ద గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆచూకీ తెలిసిన వారు 9866144616 నంబర్కు సమాచారం అందించాలని జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యక్తి మృతి కేసులో
ఐదుగురికి రిమాండ్
రాప్తాడు రూరల్: ఇంటి ఎదుట రోడ్డు స్థలం విషయంలో గొడవ చోటు చేసుకుని ప్రత్యర్థులు తోసేయడంతో కిందపడి వృద్ధుడు మృతి చెందిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్ తెలిపిన మేరకు... రాచానపల్లి పంచాయతీ నల్లనరసింగయ్యకాలనీలో నివాసముంటున్న కోనయ్య కుమార్తె విదేశాల్లో స్థిరపడింది. తనకున్న 5 సెంట్లకు పైగా స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని తండ్రికి తెలపడంతో మూడు రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని కోనయ్య శుభ్రం చేయించి, మార్కింగ్ వేయిస్తున్న సమయంలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించారంటూ పక్కనే నివాసముంటున్న గంగాధర్, ఆయన బంధువులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారు కోనయ్యను తోసేయడంతో వెనుక వైపు కిందకు పడిన ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు...గంగాధర్తో పాటు మరో నలుగురిని గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
పశుశాఖ జాబితాలు
పట్టుకొచ్చిన ప్రత్యేకదూత
● ఇంకా వెల్లడి కాని వ్యవసాయశాఖ ఏడీఏల బదిలీలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ, దాని అనుబంధశాఖల్లో జరుగుతోన్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రసహనంగా కొనసాగుతోంది. నిబంధనలు గాలికి వదిలి ఇష్టారాజ్యంగా బదిలీ ఉత్తర్వులు వెల్లడైనట్లు ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బదిలీ ప్రక్రియను గందరగోళంగా మార్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 9 నాటికే బదిలీ ప్రక్రియ ముగిసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంకా కొన్ని జాబితాలు వెల్లడి కాకపోవడం విశేషం. వ్యవసాయశాఖ ఏఓల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులతో గురువారం రెండోసారి విడుదల చేశారు. ఇక ఏడీఏల జాబితా వెనక్కి తీసుకుని మూడు రోజులవుతున్నా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక పశుసంవర్ధకశాఖలో వింత పోకడ కనిపించింది. డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), పశువైద్యులు (వీఏఎస్) బదిలీ జాబితా అలా విడుదల చేసి తక్షణమే అభయెన్స్ పెట్టడంతో అయోమయం నెలకొంది. తిరిగి జాబితాను మెయిల్ లేదా అన్లైన్ లేదా సర్కులర్ రూపంలో పంపాల్సిన డైరెక్టరేట్ అధికారులు... విజయవాడ నుంచి ప్రత్యేకదూత ద్వారా గురువారం జాబితాలను జిల్లా జేడీ కార్యాలయానికి చేర్చడం విడ్డూరంగా ఉంది. అయినా బదిలీ జాబితా అధికారికంగా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ కొనసాగుతోంది. నిబంధనలు, పారదర్శకతకు పాతరేయడంతో బదిలీల సమస్య ఇలా తయారైందని ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసులు, పలుకుబడితో పాటు కొన్ని స్థానాలు, కొందరు వ్యక్తుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

హంద్రీ–నీవా కాలువ గట్టుకు మరమ్మతులు

హంద్రీ–నీవా కాలువ గట్టుకు మరమ్మతులు