మందుబాబుల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

మందుబాబుల మధ్య ఘర్షణ

Jun 13 2025 5:15 AM | Updated on Jun 13 2025 5:15 AM

మందుబాబుల మధ్య ఘర్షణ

మందుబాబుల మధ్య ఘర్షణ

బీరు బాటిల్‌తో పొడవడంతో ఒకరికి గాయాలు

గుంతకల్లు టౌన్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులోని వైన్‌ షాపు వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు మందు బాబుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని, ఒకరిపై హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆచారమ్మ కొట్టాలకు చెందిన మధు గురువారం మద్యం బాటిల్‌ కొనుగోలు చేసి బయటకు వస్తుండగా ‘బెగ్గర్‌లు కూడా తాగని చీప్‌ లిక్కర్‌ తాగుతున్నావా?’ అంటూ కాలవగడ్డ ప్రాంతానికి చెందిన సుధాకర్‌ హేళనగా మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఆవేశానికి లోనైన సుధాకర్‌ పక్కనే ఉన్న బీరుబాటిల్‌ తీసుకునిబద్ధలుగొట్టి మధుపై దాడికి ప్రయత్నించాడు. తప్పించుకుని పారిపోతున్న మధుపై వెనుక నుంచి బీరుబాటిల్‌ ముక్కతో బలంగా పొడవడంతో తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ మనోహర్‌ ఘటనపై ఆరా తీసి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

రూ.8 లక్షలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన దేరవకొండ ఏఎస్పీ మౌనిక

దేవరకొండ (నల్లగొండ): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.17లక్షలు వసూలు చేసి పరారైన నిందితుడిని గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం విలేకరులకు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాదిన్నె కృష్ణ అలియాస్‌ వేణుగోపాలరెడ్డి 2021లో దేవరకొండకు వలస వచ్చి బీఎన్‌ఆర్‌ కాలనీలో నివాసమేర్పరుచుకున్నాడు. తాను ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. తాను పనిచేస్తున్న శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కాలనీకి చెందిన ముడావత్‌ స్వాతి, ఆమె భర్త రమేష్‌, షేక్‌ సైదాబేగం, ఆమె కుమారుడు షేక్‌ తబ్రీజ్‌కు నమ్మబలికి వారి వద్ద నుంచి సుమారు రూ.17లక్షలు వివిధ దఫాలుగా తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారు ఉద్యోగాల విషయం ఏమైందంటూ అడిగినప్పుడల్లా టైం పడుతుందని చెబుతూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల వారు గట్టిగా నిలదీయడంతో ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో బాధితులు ఈ ఏడాది మార్చి 1న దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏపీలోని అనంతపురం జిల్లాలో వేణుగోపాలరెడ్డిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కృష్ణ గతంలో తన భార్యతో కలిసి ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామంలో టైలరింగ్‌తో జీవనం కొనసాగించేవాడని, టైలరింగ్‌ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక అక్కడ కొద్దిమందితో కలిసి చిట్టీలు నిర్వహించి అక్కడి నుంచి అనంతపురానికి ఉడాయించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ పలువురిని మోసం చేసి దేవరకొండకు వచ్చాడన్నారు. కేసును ఛేదించిన పోలీస్‌ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్‌ఐలు కోటేష్‌, నారాయణరెడ్డి, పోలీస్‌ సిబ్బంది సతీష్‌, రాజారాం, అంజి, వెంకన్న, చాంద్‌పాషా, సింహాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement