
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పండిట్లు బలి
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ పూల్లో ఉన్న బాషా పండితుల ఇబ్బందులను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలూ స్పందించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ సమ్మిళిత పాఠశాలలో జరుగుతున్న ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ను డీఈఓ పూల్లో ఉన్న పండిట్లు అడ్డుకున్నారు. అరగంటకు పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ను ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. డీఈఓ పూల్లో ఉన్న పండిట్లను రెండేళ్లకోసారి బలవంతపు బదిలీలు చేస్తున్నారన్నారు. గత ఆరేళ్లలో ఇది నాలుగోసారి బదిలీ అన్నారు. గత రెండేళ్లలో సర్దుబాటు పేరుతో మరొక చోటుకి పంపారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,300 మంది పండిట్లు డీఈఓ పూల్లో ఉంటే ఉమ్మడి జిల్లాలోనే 111 మంది ఉన్నారన్నారు. వీరిలో తెలుగు 89 మంది, హిందీ 14, ఉర్దూ ఏడుగురు, కన్నడ ఒకరు ఉన్నారన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా... 2024, డిసెంబర్ 20న జస్టిస్ మన్మధరావు ధర్మాసనం (సింగిల్ బెంచ్) పండితులకు అనుకూలంగా తుది తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 2019 నుంచి అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులో ప్రమోషన్ ఇవ్వాలంటూ ఆదేశించారన్నారు. పలుమార్లు విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదున్నారు. ఇంతలో ఎస్జీటీ సంఘాల నాయకులు స్టేటస్ కో తెచ్చి సమస్యను మరింత జటిలం చేశారని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చివరకు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల్లాగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సరైన న్యాయం చేయాలని కోరారు. ఎస్జీటీల బదిలీల అనంతరం చర్యలు తీసుకుంటామంటూ ఆర్జేడీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
సర్దుబాటు పేరుతో రెండేళ్లకోసారి బదిలీ అవుతున్న డీఈఓ పూల్లోని పండిట్లు
ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ అవుతున్నామంటూ ఆవేదన
పాఠశాల విద్య ఆర్జేడీని అడ్డుకున్న పండిట్లు