
ఎండోమెంటు ఏసీకి సన్మానం
అనంతపురం కల్చరల్: జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన తిరుమలరెడ్డిని జిల్లా అర్చక సంఘాలు గురువారం ఘనంగా సత్కరించాయి. జిల్లాలోని ఆలయాల్లో నెలకొన్న సమస్యలన్నీ సందర్భంగా అర్చక సంఘాల ప్రతినిధులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు మాట్లాడుతూ... గత ఏసీ వైఖరి వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, సమస్యల పరిష్కారానికి కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఏసీ సానుకూలంగా స్పందిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య సభ్యులు శ్రీనివాసులు, చంద్రమౌళి, తిరుపతయ్య, మధుసూదనాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలు, హాస్టళ్లకు
సన్నబియ్యం పంపిణీ
అనంతపురం అర్బన్: జిల్లాలోని 1,715 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు, 183 సంక్షేమ వసతి గృహాలకు 25 కిలోల సంచుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేష్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంపిణీ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి సంచిపైన క్యూఆర్ కోడ్ జతపర్చామన్నారు. దానిని స్కాన్ చేయడం ద్వారా బియ్యానికి సంబంధించి పూర్తి వివరాలు, ధాన్యం పండించిన రైతుల వివరాలు, నాణ్యత పరిశీలించిన సిబ్బంది సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డన్లు చూడాలని సూచించారు.