
‘సాక్షి’ కార్యాలయాలపై దాడి హేయం
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై కక్ష కట్టి దాడులు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేఎస్సార్ లైవ్ షో ద్వారా ఎన్నో ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ రాజకీయ కక్షలో భాగమేనని అన్నారు. ఓ వ్యక్తి చేసిన వివాదస్పద వ్యాఖ్యల ఆధారంగా కేఎస్సార్ను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. మహిళలపై పట్టపగలే అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు.. కేఎస్సార్ విషయంలో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమేనని మండిపడ్డారు.
నీట మునిగి యువకుడి మృతి
కూడేరు: రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. అనంతపురంలోని రంగారెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్, విశాల దంపతులకు కుమారుడు భరత్కుమార్ (22) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం రావడంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్నేహితులు ఉమామహేష్, అనిల్తో కలసి బుధవారం పీఏబీఆర్ సందర్శనకు వెళ్లారు. సరదాగా నీటిలో ఈత కొడుతుండగా లోతుగా ఉన్న ప్రాంతానికి చేరుకున్న భరత్ నీట మునిగాడు. స్నేహితులు గాలించి వెలికి తీసేలోపు ఊపిరి ఆడక మృతిచెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

‘సాక్షి’ కార్యాలయాలపై దాడి హేయం