
ఆర్డీటీతో ముడిపడిన పేదల భవిష్యత్తు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ పరిరక్షణ అనేది కరువు ప్రాంత అభివృద్ధి, పేదల భవిష్యత్తుతో ముడిపడి ఉందని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ అన్నారు. సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించే అంశంపై టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేరని, కనీసం సీఎం చంద్రబాబును సైతం ప్రశ్నించలేని స్థితిలో జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర బుధవారం కంబదూరు మండలం ఓబిగానిపల్లి గేట్ వద్ద కు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో శైలజనాథ్ మాట్లాడారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై కూటమి నేతలు ఎకసెక్కాలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయం కోసమే పాదయాత్ర చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రాజకీయాల కోసమే కూటమి ఏర్పడిందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. జిల్లాలో ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారని, వారే కాక స్థానిక ఎమ్మెల్యే కూడా నడిస్తే తామేమీ వద్దనమని అన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రెండోసారి కూడా దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచన కూడా కొనసాగుతోందన్నారు. రెండో సారి దరఖాస్తు చేసుకుంటే ఇక మీ గొప్పతనం ఏముంటుందని ప్రశ్నించారు. పేదలు జీవించే హక్కును పాదయాత్ర నిర్ధారిస్తోందన్నారు. వారు చదువుకునే హక్కు...జీవించే హక్కును రంగయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర స్పష్టీకరిస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆగలేదని గుర్తు చేశారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ తీసుకురావాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీకి తామంతా తోడున్నామని, అవసరమైతే అనంతపురం వరకూ పాదయాత్ర చేపట్టి ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ... ఆర్డీటీ మూతపడితే ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. జిల్లాకు జీవనాడిగా ఉన్న ఆర్డీటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు రమేష్గౌడ్ మాట్లాడుతూ... 55 ఏళ్లుగా పేదలకు నిస్వార్థ సేవలందిస్తున్న ఏకై క సంస్థ ఆర్డీటీనే అని కొనియాడారు. చేయి చేయి కలిపి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, పార్టీ కన్వీనర్ హనుమంతరాయుడు, ఎంపీపీ భీమేష్, సర్పంచ్ సంధ్యాహరినాథ్, జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడుతో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని సాకే శైలజనాఽథ్ విమర్శించారు. కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నేతలతో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చారన్న అక్కసుతో సాక్షి టీవీ, పత్రికపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. రెండు రోజుల క్రితం అనంతపురంలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై టీడీపీ నాయకులు సాగించిన దాడి యత్నాన్ని ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు దిగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంపై ఈ పాలకులకు లేదన్నారు.
అవసరమైతే అనంతపురం వరకూ పాదయాత్ర
మాజీ మంత్రి సాకే శైలజనాథ్

ఆర్డీటీతో ముడిపడిన పేదల భవిష్యత్తు