
పరాకాష్టకు రెడ్బుక్ పాలన
ఉరవకొండ: రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపులకు దిగడం హేయమన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వ అక్రమాలు, దురాగతాలపై ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ మీడియాపై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఓ డిబేట్లో జర్నలిస్ట్ చేసిన వాఖ్యలను ప్రణాళిక ప్రకారం వివాదాస్పదం చేశారన్నారు. ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకున్నా సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రెచ్చగొట్టే ధోరణితో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతికి ఆపాదిస్తూ అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతోనే ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారన్నారు. కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేక మీడియాపై దాడులకు పక్కా ప్రణాళిక రచించారన్నారు.
పోలీసుల వైఫల్యంతోనే తన్మయి హత్య
అత్యంత దారుణంగా హత్యకు గురైన గిరిజన విద్యార్థిని తన్మయి కేసులో పోలీసుల వైఫల్యం కన్పిస్తోందని ‘విశ్వ’ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే కీచకులుగా మారి మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో 188 మంది మహిళలపై లైగింక దాడులు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించి హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.