
‘కూటమి’ తీరుతో సీమ ప్రాజెక్టులు నిర్వీర్యం
● రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య ధ్వజం
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పెద్దల తీరుతో రాయలసీమ ప్రాజెక్ట్లు నిర్వీర్యమవుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర అధక్షుడు ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు నీరు ఇస్తామని తప్పుడు ప్రచారంతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ను ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ ఉత్సాహం కుమారుని ప్రయోజనం కోసమా? లేక కమీషన్ల కోసమా అనేది సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ జిల్లాల్లోని హంద్రీ–నీవా, గాలేరి–నగరి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయి ప్రతి ఎకరాకూ నీరు అందుతుందన్నారు. అలా కాదని రూ.82 వేల కోట్లు వ్యయంతో చేపట్టే బనకచెర్ల ప్రాజెక్ట్ కేవలం కమీషన్ల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం ఎంత మాత్రం కాదనేది స్పష్టతమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇష్టానుసారంగా వాగ్ధానాలు చేయడం... అధికారం చేజిక్కించుకున్న తరువాత వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అంబానీ, ఆదానీలకు రూ.16 లక్షల కోట్ల అప్పలు రద్దు చేస్తారు కానీ... అన్నం పెట్టే రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించలేని అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఆర్గనైజింగ్ కార్యదర్శి వన్నారెడ్డి, నాయకులు వెంకటరాముడు, సూరి, తదితరులు పాల్గొన్నారు.