
‘ప్రిఫరెన్షియల్’లో దుర్వినియోగం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ కార్యాలయ సిబ్బంది నిర్వాకం కారణంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ దుర్వినియోగమైందని డీఈఓ ప్రసాద్బాబుకు పలువురు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బుధవారం డీఈఓను కలిసి అందజేశారు. నగరంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఏ ఇంగ్లిష్కు సంబంధించి ఆరు పోస్టులుండగా కొత్త బదిలీల చట్టం ప్రకారం 50 శాతం అంటే మూడు పోస్టులు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చూపించాల్సి ఉందన్నారు. అయితే ఏకంగా ఐదు పోస్టులను ఇచ్చారన్నారు. ఈ కారణంగా సీనియారిటీ జాబితాలో ఉన్న టీచర్లకు నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. పీహెచ్ (అంధులు) కేటగిరీ కింద ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆదిమూలం శ్రీనివాసులు పీహెచ్ కేటగిరీని వదిలి జనరల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నట్లు తన ఇష్టపూర్వక లేఖను సమర్పించారన్నారు. ఈ లెక్కన ఆయన పేరును జనరల్ కేటగిరీలో చూపిస్తే తర్వాత ఉన్న మహిళా టీచర్ను బాలికల పాఠశాలకు కేటాయించకుండా పురుష టీచరును నియమించారన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న జెడ్పీ యాజమాన్య టీచర్లు తిరిగి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంచుకున్నారన్నారు. అక్రమ బదిలీలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత సీనియారిటీలో ఉన్న అర్హులైన ఉపాధ్యాయులకు ఆ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యాలయ సిబ్బంది నిర్వాకంపై
డీఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు