
టీడీపీ నేతల బరితెగింపు
● పలువురిపై కర్రలతో దాడి
● దానిమ్మ చెట్ల నరికివేత
గుమ్మఘట్ట: మండలంలోని జె.వెంకటంపల్లి గ్రామంలో టీడీపీ నేతలు బరి తెగించారు. గ్రామ సమీపంలో రస్తా విషయంగా గొడవపడి నలుగురిపై కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండ 6 సంవత్సరాల వయస్సున్న 30 దానిమ్మ చెట్లను నరికి వేశారు. బాధితులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి అన్నదమ్ములు. వీరి పొలం నుంచి అదే గ్రామానికి చెందిన తమ పొలాలకు దారి ఉందని టీడీపీ నాయకులు సందీప్, వినయ్ దివాకరరెడ్డి గొడవ పడేవారు. ఈ విషయంపై ఐదేళ్లుగా కోర్టు పరిధిలో వివాదం నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ఈ క్రమంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మంగళవారం తోటలో హనుమంతరెడ్డి ఒక్కడే ఉన్నాడనే విషయం తెలుసుకుని వినయ్, సందీప్, దివాకర్రెడ్డి, ఈశ్వరరెడ్డి, కమలమ్మ, సువర్ణమ్మ చుట్టుముట్టి కట్టెలతో మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న రంగారెడ్డి, ఆయన భార్య అనంతమ్మ అడ్డుకోబోవడంతో వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం 30 దానిమ్మ చెట్టను అడ్డంగా నరికి వేశారు. విషయం తెలుసుకున్న హనుమంతరెడ్డి సోదరుడు ఈశ్వరరెడ్డి అక్కడకు చేరుకోవడంతో ఆయనను సైతం చుట్టుముట్టి దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రంగారెడ్డిని మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, ఘటనపై దాడి చేసిన వారితో పాటు బాధితులపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం వివాదస్పదమైంది. దాడికి పాల్పడిన టీడీపీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారనే విమర్శలు గ్రామంలో వ్యక్తమయ్యాయి.

టీడీపీ నేతల బరితెగింపు