
ఇంకెన్నాళ్లు పస్తులుంచుతారు?
అనంతపురం అర్బన్: ‘శరీర కష్టంతో బతుకుతున్న మమ్మలి ఇంకెంత కాలం పస్తులుంచుతారు? నాలుగున్నర నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? కనికరం లేని ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగలకపోదు’ అంటూ శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సమస్యలు పరిష్కరించాలంటూ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, అధ్యక్షురాలు నాగమణి, నీటి ప్రాజెక్టు కార్మిక సంఘం కార్యదర్శి రాము మాట్లాడారు. నీటి ప్రాజెక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదన్నారు. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా కనీసంగానూ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫేజ్–1 ట్రంక్లైన్ కార్మికులకు నాలుగున్నర నెలల వేతనాలు, 24 నెలల పీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల వేతనం నుంచి కోత విధించిన రూ.2,500ను తక్షణమే చెల్లించాలన్నారు. ఫేజ్–4 రాయదుర్గం, కళ్యాణదుర్గం కార్మికులకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించరాదని డిమాండ్ చేశారు. తాగునీటి సంస్థలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నీటి ప్రాజెక్టు కార్మిక సంఘం నాయకులు నారేష్, నాగరాజు, రామాంజనేయులు, కార్మికుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికుల ఆవేదన
నాలుగున్నర నెలలుగా అందని వేతనం
కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా