కూడేరు: మండలంలోని జల్లిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని కోర్టు రోడ్డులో నివాసముంటున్న ఆనంద్, శివవేణి (28) దంపతులు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు మహిళలతో కలసి ఆనంద్ దంపతులు, సొంత ఆటోలో పీఏబీఆర్ చూసేందుకు వెళ్లారు.
అక్కడే భోజనం ముగించుకుని సరదాగా గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమైన వారు జల్లిపల్లి సమీపంలోకి రాగానే ఉన్నఫళంగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శివవేణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్కు తీవ్ర గాయాలయ్యాయి. పద్మ, సుంకమ్మ, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.