
ఆపన్నహస్తం కోసం బాలుడి ఎదురుచూపు
పెద్దపప్పూరు: కూలి పనికి వెళితే తప్ప పూటగడవని నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన రామ్మోహన్, రేణుక దంపతులకు 12 ఏళ్ల వయసున్న కుమారుడు సంతోష్ ఉన్నాడు. చదువులో ప్రతిభ కనబరిచి మూడు నెలల క్రితం లేపాక్షిలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లింపోబ్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారించి హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడి చికిత్సకు రూ.15 లక్షలు అవసరం కాగా, గ్రామస్తులు రూ.2లక్షలను పోగు చేసి అందజేశారు. దాతలు సహకరిస్తే తమ కుమారుడి ప్రాణాలు దక్కుతాయని నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆపన్న హస్తమందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మానవతావాదులు ఎవరైనా స్పందించి 63000 49974 నంబర్కు ఫోన్పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు.