
‘కరూరు’లో కంది!
‘దుర్గం’లో వేరుశనగ..
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పంటల సాగులో ప్రాంతాల వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. భూమి నైజం, నీటి లభ్యతను బట్టి వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గినా కొన్ని మండలాల్లో సాగు అధికంగానే ఉంటోంది. ఇందులో రాయదుర్గం మండల వ్యాప్తంగా రైతులు ఏకంగా 13,953 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత గుత్తిలో 11,357 హెక్టార్లు, గుమ్మఘట్టలో 11,034 హెక్టార్లు, గుంతకల్లులో 10,753 హెక్టార్లు, శెట్టూరులో 10,551 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ ఖరీఫ్లో ఓవరాల్గా 1,82,004 హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా లెక్క వేశారు. డి.హీరేహాల్, కణేకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కుందుర్పి, కంబదూరు మండలాల్లోనూవేరుశనగ సాగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
పెద్దవడుగూరుదే అగ్రస్థానం..
ఇక నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ పంటగా పత్తి పంట 44,001 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులోనూ 15 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగుతో పెద్దవడుగూరు మండలం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత యాడికిలో 4,533 హెక్టార్లు, పామిడిలో 3,755 హెక్టార్లు, తాడిపత్రిలో 3,540 హెక్టార్లు, గుత్తి, డి.హీరేహాల్ మండలాల్లో 3,900 హెక్టార్లు చొప్పున పత్తి సాగు చేసే అవకాశం ఉంది. కణేకల్లు, బొమ్మనహాల్, విడపనకల్లు, పెద్దపప్పూరు, వజ్రకరూరు, శింగనమల, పుట్లూరు, యల్లనూరు తదితర మరో 22 మండలాల్లో కూడా పత్తి సాగవుతోంది.
కందిపైనే మక్కువ..
గత ఖరీఫ్లో 1.03 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో కంది సాగుతో చరిత్ర సృష్టించిన రైతులు ఈ ఏడాది కూడా కంది సాగుపైనే దృష్టి పెట్టారు. ఈ ఖరీఫ్లో 55,296 హెక్టార్లలో కంది సాగులోకి వస్తుందని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వజ్రకరూరు మండలంలో 8 వేల హెక్టార్లు, గుంతకల్లులో 5,500 హెక్టార్లు, కళ్యాణదుర్గంలో 4 వేల హెక్టార్లు, అనంతపురంలో 3,500 హెక్టార్లు, ఉరవకొండలో 3,400 హెక్టార్లు, బెళుగుప్పలో 3,300 హెక్టార్లు, రాప్తాడులో 3 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని 31 మండలాల్లోనూ అంతర సాగుగా కంది పంట వేయనున్నట్లు సమాచారం.
రెట్టింపు స్థాయిలో మొక్కజొన్న సాగు..
ఈ ఖరీఫ్లో మొక్కజొన్న పంట 14,563 హెక్టార్లలో సాగులోకి వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇది రెట్టింపు స్థాయిలో ఉండడం విశేషం. పెద్దపప్పూరులో అత్యధికంగా 2,300 హెక్టార్లు, యాడికిలో 1,500 హెక్టార్లు, పుట్లూరులో 1,500 హెక్టార్లు, కణేకల్లులో 1,200 హెక్టార్లు, గుమ్మఘట్టలో 1,100 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేశారు. రాయదుర్గం, తాడిపత్రి, అనంతపురం సబ్ డివిజన్లలోనూ మొక్కజొన్న సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ ఏడాది 16,293 హెక్టార్లలో ఆముదం సాగులోకి రానున్నట్లుగా అంచనా వేశారు. ఇందులో కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 2,300 హెక్టార్లు, కూడేరులో 2,200 హెక్టార్లు, ఆత్మకూరులో 1,800 హెక్టార్లు, బెళుగుప్పలో 1,700 హెక్టార్లతో పాటు మరో 20 మండలాల్లో ఆముదం సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇక కణేకల్లులో ఎప్పటిలాగానే వరి సాగుపైనే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్లో మొత్తం 20 వేల హెక్టార్లలో వరి సాగులోకి రానున్నట్లుగా అధికారులు అంచనా వేయగా... ఇందులో అత్యధికంగా కణేకల్లు మంలడం 5 వేల హెక్టార్లు ఉండడం విశేషం. ఆ తర్వాత బొమ్మనహాల్ మండలంలో 3,400 హెక్టార్లు, గార్లదిన్నె మండలంలో 1500 హెక్టార్లు, శింగనమల మండలంలో 1,200 హెక్టార్లు, పామిడి మండలంలో 1,100 హెక్టార్లతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం సబ్డివిజన్ల పరిధిలోనూ వరి నాట్లు వేయనున్నారు.
14వేల హెక్టార్లలో మిగిలిన పంటలు..
అనంతపురం, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, బొమ్మనహాల్ మండలాల్లో జొన్న పంట, డి.హీరేహాల్, పెద్దవడుగూరు మండలాల్లో కొర్ర, బ్రహ్మసముద్రంలో పెసర, పుట్లూరులో మినుము, నార్పలలో అలసంద లాంటి పంటలు కాస్త ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి సబ్ డివిజన్ల పరిధిలో ఎండుమిరప 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో టమాట, రాయదుర్గం డివిజన్లో వెయ్యి హెక్టార్లలో ఉల్లి పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఖరీఫ్ పంటల సాగులో
ప్రాంతాల వైవిధ్యం
కళ్యాణదుర్గంలో అత్యధికంగా ఆముదం సాగు
15 వేల హెక్టార్లతో పత్తికి కేరాఫ్గా
నిలిచిన పెద్దవడుగూరు
మొక్కజొన్న సాగుకు ఖ్యాతిగాంచిన పెద్దపప్పూరు
కణేకల్లులో వరి సాగే అత్యధికం