
రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
గుత్తి: గంజాయి అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఆదివారం గుత్తి రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఎస్ఐ నాగప్ప ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇకపై రోజూ తనిఖీలు చేపట్టనున్నామని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ నాగప్ప విజ్ఞప్తి చేశారు.
రైలు నుంచి జారి పడి
వ్యక్తి మృతి
గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు – రాయలచెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదరిపల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. రైలులో తలుపు వద్ద నిలబడి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కింద పడినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
తాడిపత్రిలో పట్టపగలే చోరీ
తాడిపత్రిటౌన్: స్థానిక రూరల్ పీఎస్ పరిధిలోని సాయినగర్లో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. సాయినగర్లో నివాసముంటున్న కుళ్లాయిరెడ్డి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన ఓ దుండగుడు వంట గదిలోని కిటికి గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. అక్కడే ఉన్న తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులోని ఒక బంగారు చైన్, నల్లపూసల దండ, కమ్మలు మొత్తం ఎనిమిది తులాల బంగారంతో పాటు వెండి సామగ్రిని అపహరించాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుళ్లాయిరెడ్డి కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్నయ సీఐ శివగంగాధరరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గంజాయి
తరలింపుదారుల అరెస్ట్
అనంతపురం సిటీ: రైలులో గంజాయి తరలిస్తూ అనంతపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులు రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన మేరకు... అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన రైలులో అనంతపురంలో దిగిన ప్రయాణికుల బ్యాగ్లు పరిశీలించారు. సమయంలో రెండు బ్యాగ్లో 24 కిలోల గంజాయిని గుర్తించి, సంబంధీకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రాప్తాడు మండలం సీపీఐ కాలనీ, కంబదూరు కొట్టాలకు చెందిన బిస్కట్ ఫయాజ్, బిస్కట్ మహబూబ్పీరా ఉన్నారు. వీరు భువనేశ్వర్ నుంచి గంజాయి తెచ్చి ఎక్కువ ధరకు అమ్మేవారని విచారణలో నిర్దారణ అయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐలు పవన్కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ సత్యనారాయణ
అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ కేవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జీఎంసీలోని న్యూరో సర్జరీ విభాగాధిపతిగా ఉన్న ఆయనను తాత్కాలిక అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఇక్కడ పని చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును ఒంగోలు ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావును కడప జీజీహెచ్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఇంకా ఎవరినీ నియమించలేదు.

రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు

రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు

రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు