
వారిని ఎన్కౌంటర్ చేయాలి
● ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్
అనంతపురం టవర్క్లాక్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో బాలికను బెదిరించి సామూహిక అత్యాచారంతో గర్భవతిని చేసిన కామాంధులను ఎన్కౌంటర్ చేయాలని, ఇందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా ఆదివారం అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. దళిత బాలికను బెదిరించి ఆరు నెలల పాటు 17 మంది యువకులు అత్యాచారం చేశారని తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేకూరేలా కామాంధులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సోమవారం ఏడుగుర్రాలపల్లిలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి దళిత సంఘాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ కొడవండ్ల, బీకేఎస్ ఆనంద్, ఓబులేసు, చంద్ర, వన్నూరుస్వామి, మదమంచి శ్రీనివాసులు, రామకృష్ణ, దావిదు, సూర్యనారాయణ, ఎర్రిస్వామి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
● దళిత బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వారికి ఉరి శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ట యల్లన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఈఎఫ్ నాయకులు రామచంద్ర, కేపీ నారాయణస్వామి పాల్గొన్నారు.
నేడు షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటి ‘షైనింగ్ స్టార్స్’గా ఎంపికై న విద్యార్థులకు సోమవారం అనంతపురంలోని మూడో రోడ్డులో ఉన్న జీఆర్ ఫంక్షన్ హాల్లో అవార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లాలో 184 మంది పదో తరగతి విద్యార్థులు, 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అవార్డులకు ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు పురస్కారం అందజేయనున్నారు. విద్యార్థులు ఆయా స్కూళ్ల యూనిఫాంతో ఉదయం 9 గంటల్లోపు వేదిక వద్దకు చేరుకోవాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ భోజన వసతి కల్పించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కానున్నారు.
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
గార్లదిన్నె: మండలంలోని కనుంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులతో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, కుమార్, వెంకటలక్ష్మికి అదే పార్టీకి చెందిన రాము, సంతోష్, ఇందు, నల్లమ్మతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఇరు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఘటనలో గాయపడిన ఇరు వర్గాల వారినీ స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డెడ్ స్టోరేజీకి ‘పీఏబీఆర్’ నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం గణనీయంగా తగ్గుతోంది. రిజర్వాయర్కు ఇన్ఫ్లో లేదు. ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు, నీటి ఆవిరి, లీకేజీల కారణంగా రోజుకు 80 క్యూసెక్కుల వరకు నీరు బయటకెళుతోంది. దీంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతోంది. రిజర్వాయర్ వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. ఆదివారం నాటికి 2.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.