
ప్రతి విద్యార్థికీ మిత్ర కిట్లు అందించాలి
బత్తలపల్లి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థికీ అందేలా చొరవ తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్, విద్యాశాఖ జేడీ సుబ్బారావు పేర్కొన్నారు.బత్తలపల్లిలోని ఎమ్మార్సీలో పంపిణీకి సిద్దంగా ఉన్న మిత్ర కిట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అందిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, డిక్షనరీలు, బ్యాగులు, బెల్ట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. నిర్ణీత సమయంలోపు కిట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఎంఈఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్నాయక్, ఎమ్మార్సీలు గోవిందరెడ్డి, వెంకటరమణ, సునీత, మంజుల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నరసింహమూర్తి, షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.