
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరు–బీదర్
మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ (06589)లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్ చేరుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ (06590)లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజూమున 3 గంటలకు బెంగళూరు జంక్షన్కు చేరుతుందన్నారు. యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాహబాద్, కలబురిగి, హోమ్నాబాద్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 3–ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీఫార్మసీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ శంకర్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శింగనమల, నార్పల, అనంతపురం, రాయదుర్గం, శెట్టూరు, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, ఉరవకొండ, విడపనకల్లు, బ్రహ్మసముద్రం, కణేకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, యాడికి, కూడేరు, బుక్కరాయసముద్రం, వజ్రకరూరు, కుందుర్పి తదితర మండలాల్లో వర్షం పడింది. కాగా గురువారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.