
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏలేరు కాలువకు శాపం
● లీకేజీ ద్వారా కాలువలో తగ్గిన నీటి ప్రవాహం ● పూడికలు, మరమ్మతులపై నిర్లక్ష్యం
నాతవరం: ఏలేరు కాలువలో పూడికతీత, మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో లీకేజీ ద్వారా నీరంతా వృధాగా పోతుంది. విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి కాలువద్వారా నీటిని తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 154 కిలో మీటర్ల పొడవునా ఏలేరు కాలువ ఉంది. ఈ కాలువ ద్వారా విశాఖపట్నం ప్రజలకు తాగునీరు ఎన్టీపీసీ, గంగవరం పోర్టు, ఏపీఐఐసీ తదితర పరిశ్రమలకు నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి నీటి అసవరాలను బట్టి 250 నుంచి 300 క్యూసెక్కులు నీటిని తరలిస్తుంటారు. ఏలేరు కాలువలో ప్రతి ఏటా వేసవిలో పూడిక తీసి కాలువకు మరమ్మతులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈఏడాది వేసవిలో ఏలేరు కాలువలో పూడికతీత పనులతో పాటు మరమ్మతు పనులు చేపట్టలేదు. ఏలేరు కాలువలో ఎక్కడ చూసినా పూడిక పెరిగిపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. తుపానులు, వర్షాల సమయంలో నీటి ఉధృతికి అనేక చోట్ల కాలువ గట్టు కోతకు గురై గండిపడేలా దర్శనమిస్తున్నాయి. గం డి పడేలా దర్శన మిస్తున్నాయి. నాతవరం మండలంలో 12 పంచాయతీల పరిధిలో సుమారుగా 25కిలో మీటర్ల మేర ఏలేరు కాలువ ప్రవహిస్తుంది. జిల్లేడుపూడి వద్ద ఏలేరు కాలువకు సొరంగం మార్గం 3 కిలోమీటర్లు మేర ఏర్పాటు చేశారు. ఎ.శరభవరం, లింగంపేట, మన్యపురట్ల, ఉప్పరగూడెం, గునుపూడి, రాజుపేట అగ్రహారం , పీకేగూడెం, నాయుడుపాలెం, చినగొలుగొండపేట, పి.జగ్గంపేట, ఎం.బి.పట్నం గ్రామాల వద్ద ఏలేరు కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పూడికతో పాటు ఏలేరు కాలువ శిథిలం కావడంతో నిత్యం లీకేజీ ద్వారా నీరంతా వృధాగా పోతుంది. ఎ.శఽరభవరం వద్ద పంటపొలాల్లో ఏలేరు కాలువలో లీకేజీ నీరు ప్రవాహం చూస్తే ఆయకట్టు భూములకు నీరు విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. కాలువలో పూడిక తీసి బలహీనంగా ఉన్న ఏలేరు గట్లు పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై ఏలేరు కాలువ జేఈ గోపీనాథ్ మాట్లాడుతూ పూడికతీత మరమ్మతులు చేసేందుకు రూ.60 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం మండలం వేములపూడి దగ్గర ఏలేరు కాలువలో పూడికతీత పనులు చేస్తున్నామన్నారు. నీరు వృథాగా పోకుండా ఏలేరు కాలువలో నీటి ప్రవాహం తగ్గిస్తామన్నారు.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఏలేరు కాలువకు శాపం