
మిత్రుడిని పరామర్శించిన కాసేపటికే..
లంకెలపాలెం ప్రమాదంలో కన్నుమూసిన అనకాపల్లి వాసులు
అనకాపల్లి టౌన్: స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నీకేమీ పర్వాలేదు, మేమున్నామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రెవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం పరితపించారు. అంతలో తామే అనంతలోకాలకి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి లంకెలపాలెంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలివి.. అనకాపల్లి మళ్ళవీధికి చెందిన బండారు రమణ విశాఖపట్నం కేజీహెచ్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. అతనిని పరామర్శించడానికి మిత్రులు కర్రి అప్పాజీ, పచ్చికూర గాంధీ, కొణతాల నాయుడు కారులో వెళ్లి రమణకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో షీలానగర్ జంక్షన్లో వైన్ షాపులో పనిచేస్తున్న మరో స్నేహితుడు కొణతాల అచ్చియ్యనాయుడిని కారులో ఎక్కించుకొన్నారు. లంకెలపాలెం జంక్షన్లో సిగ్నల్ పడడంతో వీరి వాహనం ఆగింది. ఇంతలో వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొనడంతో వీరి కారు, సమీపంలో ఉన్న ద్విచక్రవాహనాలు, కంటెయినర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కొణతాల అచ్చియ్యనాయుడు, పచ్చికూర గాంధీ చనిపోగా కర్రి అప్పాజీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అగనంపూడికి చెందిన ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు.
తలలో నాలుకలా ఉండే గాంధీ
అందరికీ తలలో నాలుకలా ఉండే గాంధీ చనిపోయాడనే వార్తతో రేబాక గ్రామం ఉలిక్కిపడింది. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఉమ్మడి కుటుంబానికి తనే పెద్ద దిక్కు కావడంతో గాంధీ లేని లోటు తీర్చలేనిదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గాంధీకి భార్య, కూతురు, కొడుకు ఉండగా కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. మంగళవారం మధ్యాహ్నం వందలాదిమందితో గాంధీ అంతిమ యాత్ర జరిగింది. కొణతాల అచ్చియ్యనాయుడుకు వైన్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు.