
● దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసుల అరె
పెందుర్తి: అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ప్రేమ జంటలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను పెందుర్తి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కె.వి.సతీష్కుమార్ వెల్లడించారు.
విజయనగరం జిల్లా ధర్మవరం మండలం మామిడిపాలేనికి చెందిన ఏతలపాక శివప్రసాద్, నగరంలోని రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న కదరాపు గోపీతో కలిసి దారి దోపిడిలు చేయడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంలు ధరించి అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ఈ నెల 3 నుంచి 6 వరకు మాటు వేశారు. రోజూ పొద్దుపోయాక అటుగా వెళ్తున్న ప్రేమ జంటలను గమనించేవారు. వారు ఎక్కడైనా బైక్లు నిలిపి మాట్లాడుకోవడం, లేదా అనుమానం కలిగేలా ప్రవర్తించడం చూసి వారి వద్దకు వెళ్లి, బెదిరింపులకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోరాడ జయరాం అనే వ్యక్తి గాజువాక నుంచి బైక్పై తనకు కాబోయే భార్యతో కలిసి విజయనగరం వెళ్తున్నాడు. సరిగ్గా అడవివరం భైరవకోన దాటాక వారిని అడ్డగించిన శివప్రసాద్, గోపి తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగారు. నగదు ఇస్తే వదిలేస్తామని, లేదంటే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని భయపెట్టారు. అయితే నగదు లేదని, ఫోన్పే ద్వారా ఇస్తానని చెప్పడంతో నిందితుడు శివప్రసాద్ తన వద్ద ఉన్న ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా రూ.5 వేలు నగదు బదిలీ చేయించుకున్నాడు. వీరి తీరుపై అనుమానం వచ్చిన జయరాం అదే రోజు రాత్రి విశాఖ సీపీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
పది జంటల నుంచి వసూళ్లు
ఈ నెల 3 నుంచి 6 వరకు దాదాపు పది జంటల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2 వేలు నగదు, స్కూటీ, రెండు సెల్ఫోన్లతో పాటు రెండు పోలీస్ యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడని, అతడి అనుచిత ప్రవర్తన కారణంగా 2019లో ఉద్యోగం నుంచి తొలగించినట్లు సీఐ తెలిపారు. శివప్రసాద్పై దోపిడి, దొంగతనం కేసులు 15 ఉండగా, అందులో 9 దోపిడీ కేసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయన్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సీహెచ్ స్వామినాయుడు, హెచ్సీ గెదెల అప్పారావు, పీసీలు రొంగలి సంతోష్కుమార్, ప్రగడ గణేశ్వరరావు, గాదె శంకర్రావులను ఉన్నతాధికారులు అభినందించారు.