
సన్నబియ్యంతో ‘మధ్యాహ్న భోజనం’
కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభమైందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సన్నబియ్యంతో మరింత నాణ్యంగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాముల నుండి పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,418 ప్రభుత్వ పాఠశాలలు, 136 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు కలిపి 16,898 నాణ్యమైన సన్నబియ్యం సంచులను (25 కేజీల) చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ముద్రించడం జరిగిందని తెలిపారు.