
ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి
తుమ్మపాల: తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించి కార్మికుల సమస్యలను వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మె చేస్తే యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. కార్మికులను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె.త్రినాథ్, కోరిబిల్లి శంకరరావు, సిహెచ్.రమణ, ఫణీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు.