
నిరుద్యోగ భృతి ఎక్కడ..?
● విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎప్పుడు? ● కూటమి పాలనలో పెరిగిపోయిన నిరుద్యోగం ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతల ధ్వజం
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచిందని, తల్లికి వందనం పథకం రెండో ఏడాది కూడా అమలు చేసే పరిస్థితి కనబడడం లేదని, నిరుద్యోగు భృతి ఎప్పుడు ఇస్తారో సీఎం చంద్రబాబుకే అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాది అవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నిరుద్యోగులకు జాబ్ క్యాలండర్ ఇస్తామన్న హామీ బుట్టదాఖలైందన్నారు. యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్న యువతను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చాక జనసేన అధినేత పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం, నారా లోకేష్కు మంత్రి పదవులు వచ్చాయి తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు దక్కింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అనేక స్కీమ్లు అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో స్కామ్ల పాలన సాగుతుందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలను తీసివేయడం జరిగిందని, దీంతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు కూడా నేటికీ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలన కంటే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే ఎక్కువగా జనం మద్దతు పలుకుతున్నారని, ఇటీవల పొదిలిలో జరిగిన సభలో ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండల యువజ విభాగం అధ్యక్షుడు బాదపు హరికృష్ణ, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు నీటిపల్లి దివాకర్, పార్టీ సీనియర్ నాయకులు మరిపల్లి శోభ, కోన ఉమా, శ్రీకాంత్, డానీ, దాడి నారాయణరావు, కొంకి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.