
చిన్నారులకు ఆటపాటలతో బోధన అవసరం
అనకాపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో బోధన అవసరమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక వేల్పులవీధి అంగన్వాడీ కేంద్రంలో గురువారం మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 52 మంది చిన్నారులకు సాముహిక అక్షరాభాస్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులే కాకుండా మంచి విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ బాల్య ఆరంభ దశలో పిల్లలను తీర్చి దిద్దడంలో అంగన్వాడీ కార్యకర్త పాత్ర ఎంతో కీలకమైందన్నారు.
సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ ప్రీస్కూల్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రాథమిక విద్యను పూర్తి చేసిన 5 సంతవ్సరాల చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పి.ప్రభావతి, ప్రాజెక్టు సూపర్వైజర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ సారథ్యంలో సుపరిపాలన
అనకాపల్లి టౌన్: బీజేపీ 11 సంవత్సరాల సుపరిపాలనలో ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.