
విధులకు వెళ్తుండగా విధి చిన్నచూపు
● స్కూటీని ఢీకొన్న కంటైనర్
● చెల్లెలు మృతి, అన్నయ్యకు తీవ్రగాయాలు
కూర్మన్నపాలెం : ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్లాం రైల్వే గేటుకు సమీపంలో కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో చెల్లెలు ఘటన స్థలంలో మృతి చెందగా అన్నయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ జగ్గరాజుపేటలో నివాసం ఉంటున్న గొంప శ్రీను, మణి దంపతులకు సతీష్(29), గీత(24) అనే పిల్లలు ఉన్నారు. తండ్రి శ్రీనివాస్ ఒక ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నాచెల్లెళ్లు కూడా ఆటోనగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్గాం రైల్వేగేటు సమీపంలో కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. గీత లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కకు పడిపోయిన సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సతీష్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అందివచ్చిన కుమార్తె మృతి చెందడం, కుమారుడు తీవ్రగాయాలపాలవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విధులకు వెళ్తుండగా విధి చిన్నచూపు