
వేతనాల కోసం విమ్స్ వైద్యుల ధర్నా
ఆరిలోవ: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు గురువారం ధర్నా చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కాంట్రాక్ట్ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విమ్స్ ఆవరణలోని అవుట్ పేషెంట్ విభాగం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హారిక తదితర వైద్యులు మాట్లాడారు. తాము రూ. 92,000 జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో విమ్స్లో చేరి మూడేళ్లు పూర్తయిందని, కానీ ఇప్పటివరకు తమ వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు స్పందించలేదని వైద్యులు ఆరోపించారు. తమ వేతనాలను రూ.1.60 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు ధర్నా చేసిన రెండు గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడ్డారు.