
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై పోరాడదాం..
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై సభ్య రైతులతో కలిసి పోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావును స్వగ్రామమైన గోవాడలో బుధవారం అమర్నాథ్ పరామర్శించారు. సత్యారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని ముఖ్య నాయకులతో అమర్నాథ్ సమీక్షించారు. ఇటీవల అమెరికా పర్యటన తర్వాత మొదటి సారిగా నియోజకవర్గానికి రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో మాట్లాడారు. గ్రామాల్లో, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై గ్రామస్థాయి నాయకులు వివరించారు. అలాగే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారవుతోందని, రైతులకు చెరకు బకాయిలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఫ్యాక్టరీ లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అమర్నాథ్ స్పందిస్తూ ఈ విషయమై ఫ్యాక్టరీ, చెరకు రైతుల పరిస్థితిని ప్రభుత్వానికి తెలిసేలా పోరాటం చేయాలన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో మండల స్థాయి, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ముందుగా మండలాల వారీగా నాలుగు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. చోడవరం మండల సమావేశం ఈ నెలలో నిర్వహించేందుకు నిర్ణయించామని, త్వరలో సమావేశం తేదీని తెలియజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, ఎంపీపీ గాడి కాసు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, శరగడం నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ పల్లా రమణ, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, ప్రధాన కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, జిల్లా కార్యదర్శి పోతల శ్రీనివాసరావు, డీఆర్యూసీ సభ్యుడు బొడ్డు శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ మరింత బలోపేతం దిశగా విస్తృత సమావేశాలు
పార్టీ చోడవరం సమన్వయకర్త,
మాజీ మంత్రి అమర్నాథ్