
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మునగపాక: రబీ సీజన్లో సాగైన వరిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో వరి పంట సాగు చేసి గింజలను సేకరించే క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండలంలోని వాడ్రాపల్లిలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్న సమాచారం మేరకు ఆయన బుధవారం ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సకాలంలో మెరుగైన ధరలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కల్లాల్లో ధాన్యం పాడైపోయి రైతులు అల్లాడిపోతున్నా పాలకులు, అధికారులకు పట్టకపోవడం విచారకరమన్నారు. రంగు మారిన ధాన్యానికి కూడా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సరైన ధర అందించారన్నారు. అన్ని విధాలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కాండ్రేగుల నూకరాజు, భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, రైతులు బొడ్డేడ సత్యనారాయణ, మళ్ల జోగినాయుడు, కాండ్రేగుల లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
రబీ వరికి గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇబ్బందులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్