
ఫార్మా కంపెనీ బస్సుకు మంటలు
● ఇంజిన్ ఆయిల్ లీకేజీయే కారణం
అనకాపల్లి టౌన్: పరవాడ లారస్ కంపెనీకి చెందిన బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చోడవరంలో నివాసముంటున్న కంపెనీ ఉద్యోగులను తీసుకురావడానికి లంకెలపాలెం నుంచి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బస్సు బయలుదేరింది. తుమ్మపాల దర్జీనగర్కు చేరుకొనే సమయంలో వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనదారులు బస్సు వెనక మంటలు వస్తున్నాయని చెప్పడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఈ సమయంలో బస్సులో మరెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం ఇంజిన్లో ఆయిల్ లీకేజీ వలన జరిగిందని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. బస్సు ముందు భాగం, లోపల సీట్లు పూర్తిగా కాలిపోయాయి.