
ఏయూలో కొలువుదీరిన కొత్త నాయకత్వం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాలకు నూతన నాయకత్వం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు చేతుల మీదుగా డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లకు బుధవారం నియామక ఉత్తర్వులను అందించారు. మొత్తం 43 మందికి వివిధ పదవీ బాధ్యతలను కేటాయించారు. అనంతరం వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించామని, త్వరలో నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రతి విభాగం పనిచేయాలన్నారు. విద్యార్థులతో, సిబ్బందితో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు.
యువతకు ప్రాధాన్యత : నూతనంగా నియామకం చేసిన డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లలో అత్యధికంగా యువతకు అవకాశం కల్పించారు. ప్రతి విభాగంలో ఉన్న యువ ఆచార్యులను ఎంపిక చేసి ఈ బాధ్యతలు కేటాయించారు. భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వర్సిటీని ముందుకు నడిపించే దిశగా యువ ఆచార్యులను ప్రోత్సహించేందకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.