లక్ష్మీపురంలో దాహం కేకలు.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీపురంలో దాహం కేకలు..

Jun 11 2025 8:44 AM | Updated on Jun 11 2025 8:44 AM

లక్ష్

లక్ష్మీపురంలో దాహం కేకలు..

చోడవరం : విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామానికి మంచినీళ్లు లేకుండా చేసింది. మంచినీళ్ల కోసం లక్ష్మీపురం గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 10 రోజులుగా ఈ గ్రామంలో కుళాయిల నుంచి మంచినీళ్లు రాక బిందెడు నీళ్ల కోసం బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామంలో ప్రజలకు మంచినీళ్లు సమస్య ఉత్పన్నమైంది. చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో సుమారు 5వేల మంది జనాభా ఉన్నారు. కొద్ది నెలలుగా ఈ గ్రామంలో తీవ్ర లోఓల్టేజీ సమస్యతో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కొక్కటిగా కాలిపోతూ వచ్చాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి అనేకసార్లు చోడవరం విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తాజాగా మరో ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్లు అన్నీ కాలిపోవడంతో విద్యుత్‌ సరఫరా లేక గ్రామంలో ఇంటింటి కుళాయిలకు మంచినీరు సరఫరా చేసే ట్యాంక్‌లకు బోర్‌ వెల్స్‌ నుంచి నీరు పంపింగ్‌ జరగలేదు. మంచినీటి ఓవర్‌ హెట్‌ ట్యాంక్‌లకు నీరు పంపింగ్‌ జరగకపోవడంతో గ్రామంలోకి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా నిలిచిపోయింది. బోల్‌వెల్స్‌ మోటార్లు కూడా కాలిపోవడంతో పంచాయతీ నుంచి వాటికి మరమ్మతులు చేయించారు. అయినా లోఓల్టేజీ కారణంగా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మరే కాలిపోవడంతో పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాలంటూ జాప్యం చేసుకుంటూ వస్తున్నారే తప్ప ట్రాన్స్‌ఫార్మర్లు బాగుచేయించి లోఓల్టేజీ సమస్య నివారించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే చర్యలు మాత్రం విద్యుత్‌ శాఖ అధికారులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో సరఫరా లేక నీరు ఇవ్వలేదు. దీంతో మంచినీటి సమస్యతో లక్ష్మీపురం ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం చేతిబోర్లు, వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు. వేలాది మంది ప్రజలు మంచినీటి కోసం కష్టాలు పడుతున్నా అధికారులు మాత్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

5వేల మంది గ్రామస్తుల మంచినీటి

సమస్యను పట్టించుకోని అధికారులు

లో ఓల్టేజీ సమస్యతో కాలిపోయిన 4 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

కరెంటు లేక వారం రోజులుగా నిలిచిన మంచినీటి సరఫరా

నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విద్యుత్‌ శాఖ అధికారులు

మంచినీటి కోసం గగ్గోలు పెడుతున్న జనం

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

లో ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని పదినెలులుగా విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మంచినీటి ట్యాంక్‌కు నీరు పంపింగ్‌ చేసే ప్రదేశంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా కాలిపోవడంతో కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయలేదు. ఎంపీడీవోకి, విద్యుత్‌శాఖ ఏడీఈకి ఫిర్యాదు చేశాను. అయినా వారు చర్యలు తీసుకోలేదు. పంచాయతీ నుంచి ఏమీ చేయలేని పరిస్థితి. జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

– శిరుచోళ్ల గంగాభవానీ గణపతినాయుడు, సర్పంచ్‌, లక్ష్మీపురం, చోడవరం మండలం

లక్ష్మీపురంలో దాహం కేకలు..1
1/1

లక్ష్మీపురంలో దాహం కేకలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement