
కారును ఢీకొన్న టిప్పర్ లారీ
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం కూడలిలో మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రాణహాని నుంచి అదృష్టవశాత్తూ సురక్షితంగా బయట పడ్డారు. అయితే కారు మాత్రం దెబ్బతింది. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న కారును, అదే మార్గంలో వస్తున్న పెద్ద టిప్పర్ లారీ ఢీకొని సుమారు వంద మీటర్ల దూరం వరకు కారును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లిపోసాగింది. దాన్ని డ్రైవర్ గమనించలేదు. స్థానికులు గమనించి పరుగున వెళ్లి లారీ ఆపడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ కారు ఢీకొన్న తర్వాత బోల్తా పడకుండా సాధారణ స్థితిలో ముందుకు ఈడ్చుకు వెళ్లింది. దీంతోపాటు స్థానికులు గమనించి లారీ ఆపడంతో నిలిపారు. దీంతో ప్రమాదం తప్పింది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కాకినాడ వద్ద ఉప్పాడకు చెందిన ప్రైవేటు వైద్యుడు హరనాథరాజు, భార్య మేరీమణి, బంధువు అయిన డైవర్ యు. ప్రకాష్ ఉన్నారు. వీరు విశాఖ నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న కాకినాడకు సొంత కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో హమ్మయ్య..అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మేరీమణి మాత్రం కొంత సేపు షాక్కు గురై అనంతరం తేరుకున్నారు. ప్రమాదంలో కారు కుడి పక్క భాగం దెబ్బతింది. ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా తొలగించారు. ప్రమాద వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కారును ఢీకొన్న టిప్పర్ లారీ