
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
జిల్లా వ్యాప్తంగా పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు చేశారు. అనకాపల్లిలో సీఐ విజయకుమార్కు, పాయకరావుపేట పోలీసు స్టేషన్లో ఎస్ఐ పురుషోత్తంకు స్థానిక పాత్రికేయులు సహా సాక్షి విలేకరులు ఫిర్యాదులు అందజేశారు. కోటవురట్ల పోలీసు స్టేషన్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ఎం.రాజు, డి.అప్పారావు ఫిర్యాదు చేశారు.
యలమంచిలి, దేవరాపల్లి, గొలుగొండ, కె.కోటపాడు, నక్కపల్లి, మునగపాక, రోలుగుంట, రావికమతం, అచ్యుతాపురం స్టేషన్లలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందజేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు