
నిండుకుండలా పెద్దేరు
మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు నీరు చేరి పెద్దేరు జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది. జలాశయంలోకి నీరు పుష్కలంగా చేరడంతో ఖరీఫ్కు కలసి వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దేరు ఖరీఫ్ ఆయకట్టు సుమారు 15 వేల ఎకరాలు. ఇప్పటికే రైతులు వరి నారుమడులు సిద్ధం చేశారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.50 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు అధికమైతే పెద్దేరు గేట్లు ఎత్తవలసి ఉంటుందని జలాశయం జేఈ సుధాకర రెడ్డి తెలిపారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట పెద్దేరులోకి దిగవద్దని జేఈ సూచించారు.