
హెచ్ఎంలు, ఎంఈవోలకు పదోన్నతులు కల్పించాలి
అనకాపల్లి: విద్యా శాఖలో హెచ్ఎంలు, ఎంఈవోలకు పదోన్నతులు కల్పించాలని ఏపీ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరమణ డిమాండ్ చేశారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో ఆదివారం సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రమాణాల మెరుగుతో పాటు పర్యవేక్షణ పెంచడం కోసం తక్షణమే ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఎంఈవోలుగా, ఎంఈవోలను డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటు చేసిన క్లస్టర్ హైస్కూల్స్ హెడ్ మాస్టర్ పోస్ట్లను గ్రేడ్–ఐహెచ్ఎం పోస్ట్గా అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ తయారు చేసి పదోన్నతి కల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు పనిభారం తగ్గించాలని, అధికారులు ర్యాంకుల కోసం పరుగులు పెడుతూ, సొంత అజెండాలతో విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర శాఖలలో రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన వారు డీఈవోలు, ఆర్జేడీలుగా రిటైర్ అవుతున్నారని, 16 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన హెచ్ఎంలు, ఎంఈవోలుగా ప్రమోషన్ లేకుండా పదవీ విరమణ చేయడం దారుణమన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల కోసం వెంటనే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) కమిటీ నియమించి ఇంటీరియర్ రిలీఫ్(ఐఆర్)ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి సి.వి.వి.సత్యనారాయణ, సభ్యులు కె.సత్యనారాయణ, సిహెచ్.రవి, వి.నూకరాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఎ.వి.హెచ్.శాస్త్రి, కార్యదర్శి ఎం.జె.రవీంద్రబాబు, జిల్లా నాయకులు కోడి శ్రీనివాసరావు, వరాహమూర్తి, శేషగిరిరావు, శ్రీరామమూర్తి, రామస్వామినాయుడు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.