
ఆదర్శనీయమైన సమాజం వీహెచ్పీ ధ్యేయం
అనకాపల్లి: నేటి యువత నైతిక, ధార్మిక విలువల తో నియమబద్ధమైన జీవితాన్ని గడపాలని, హిందూ ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డి.డి.నాయుడు తెలిపారు. జీవీఎంసీ విలీన గ్రామం సిరసపల్లి వద్ద చింతామణి గణపతి దత్తక్షేత్ర ఆవరణలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘దుర్గావాహిని’ ప్రాంత శౌర్య ప్రశిక్షణా వర్గ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 నుంచి 36 ఏళ్ల మహిళలకు వచ్చే నెల 2 వరకూ శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల నుంచి వీహెచ్పీ మహిళలు హాజరయ్యారన్నారు. గైనకాలజిస్టు మాధురి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ వైభవం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మన పూర్వీకులు ఎన్నెన్నో త్యాగాలు చేశారన్నారు. వారందరి దివ్య జీవితాలను మనం తెలుసుకుని నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో గౌరవనీయమైన జీవనం గడిపే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. యువతి ద్వారానే ఆదర్శనీయమైన సమాజ నిర్మాణం చేయాలన్నదే వీహెచ్పీ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రతినిధి శ్రీకాళహస్తి, రాష్ట్ర మహిళా ప్రముఖ్ టి.సునీతాదేవి, రాష్ట్ర దుర్గా వాహినీ సంయోజిక సి.హెచ్.శోభారాణి, జిల్లా కార్యదర్శి ప్రదీప్ శర్మ, జిల్లా సహ కార్యదర్శులు పూజ్యం నాగబాబు, బోడాల వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు రామకొండలరావు, పట్టణ అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, కార్యదర్శి సరిశా సింహాచలం, సహ కార్యదర్శులు రమేష్, పీలా హేమ జగదీష్ నాయుడు, ఆడారి రాజు పాల్గొన్నారు.

ఆదర్శనీయమైన సమాజం వీహెచ్పీ ధ్యేయం