
టీచర్ను నియమించాలని ఆందోళన
ముంచంగిపుట్టు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కొర్రా త్రినాథ్ ధ్వజమెత్తారు. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కార్లపోదోర్ జీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు లేక మూసి ఉండడంపై విద్యార్థులు,తల్లిదండ్రులు బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించి, పాఠశాల తెరించి చదువు చెప్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ కార్లపోదోర్ జీపీఎస్ పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉన్నారని, గత 13 రోజులుగా ఉపాధ్యాయుడు లేక పాఠశాల మూసి ఉందన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోయారని, ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడం అన్యాయమన్నారు.గిరిజన ప్రాంతంలో విద్యాప్రమాణాల మెరుగుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి విఫలం అయ్యారని దుయ్యబెట్టారు. ఇప్పటికై నా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ ప్రతినిధులు నీలకంఠం, గోపాల్, కామరాజు, శ్రీను,రాజు, లైకోన్, రాంబాబు, కోమటి, కృష్ణ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.