
మెరుగైన వైద్య సేవలు అందించాలి
రాజవొమ్మంగి: రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంపై మండలంలోని లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారిని స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రశ్నించారు. పీహెచ్సీ వద్ద రోగుల ధర్నా పేరిట బుధవారం ‘సాక్షి’ వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్ మిరియాల గణలక్ష్మి పీహెచ్సీకు వెళ్లి రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంపై వైద్యాధికారి నాగార్జునను ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పీహెచ్సీలో డాక్టరు లేరని, ఇందుకు బాధ్యులు ఎవరని నిలదీశారు. మూడు రోజులుగా హాజరు పట్టీలో అటెండెన్స్ లేదని, అయితే ఈ రోజు వైద్యులు యధావిధిగా విధులకు హాజరైనట్లు సంతకాలు ఉన్నాయని, ఇదేమిటని సర్పంచ్ గణలక్ష్మి డాక్టర్ను అడిగారు. రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. దీనిపై డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం కొరవడిందని, ఫలితంగా మలేరియా, టైఫాయిడ్ జ్వరపీడీతుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. వైద్యుని పొంతలేని సమాధానంపై ఎంపీపీ వెంకటలక్ష్మి డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీలో పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. లోతట్టు ప్రాంతం లాగరాయి పీహెచ్సీకు మరో డాక్టర్ను నియమించాలని, పూర్తి స్థాయిలో మందులు సరఫరా చేయాలని వారు అధికారులను కోరారు.
లాగరాయి పీహెచ్ని సందర్శించిన
ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్ గణలక్ష్మి