
అంగన్వాడీల సంక్షేమం పట్టని సర్కార్
పాడేరు : అంగన్వాడీ కార్యకర్తలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి.నాగమ్మ, ప్రధాన కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చిరుద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారన్నారు. పని గంటలను పెంచి కార్మికులపై తీవ్ర ఒత్తిడి పెంచారని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, ఆయాలకు రూ.7వేలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి కూటమి నాయకులు సిగ్గు లేదా అని అన్నారు. ప్రభుత్వం అందజేసిన ఫోన్లు సక్రమంగా పని చేయడం లేదని దీంతో ఎఫ్ఆర్ఎస్ వేసేందుకు కష్టతరమవుతోందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో పద్మలతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి సుందర్రావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళావతి, జిల్లా నాయకులు చిన్నారి, పెంటమ్మ, కొండమ్మ, వెంకటలక్ష్మి, మంజుల, శాంతి తదితరులు పాల్గొన్నారు.
పథకాలు అమలు చేయాలని
డిమాండ్ చేస్తూ ధర్నా