రంపచోడవరం: మహిళలు తమకు రక్షణగా నిలిచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రంపచోడవరం ఎస్డీపీవో అష్రిఫ్ అలీ అన్నారు. మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై రంపచోడవరంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచి హెల్మెట్ ధరించి మోటార్ బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళా భద్రత, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ రమేష్, వీఓఏలు, ఐసీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


